బీజేపీ గెలుపు.. సంవత్సరాల తర్వాత బెంగాల్ లో తెరుచుకున్న దుర్గామాత ఆలయం
- అసన్సోల్లోని బస్తీన్ బజార్ ప్రాంతంలో పండుగ వాతావరణం
- ఇప్పటి వరకు కేవలం పండుగ సమయంలో మాత్రమే తెరుచుకున్న దుర్గా మాత ఆలయం
- ఆలయం తలుపులు తెరిపించిన బీజేపీ ఎమ్మెల్యే కృష్ణేందు ముఖర్జీ
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత పశ్చిమ బర్ధమాన్ జిల్లా అసన్సోల్లోని బస్తీన్ బజార్ ప్రాంతంలో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. అక్కడ సంవత్సరాలుగా మూతపడ్డ దుర్గామాత ఆలయం తెరుచుకుంది. గతంలో కేవలం పండుగల సమయంలో మాత్రమే తెరుచుకునే శ్రీ శ్రీ దుర్గామాత ఛారిటబుల్ ట్రస్ట్ ఆలయాన్ని, ఇకపై ఏడాది పొడవునా భక్తుల దర్శనార్థం తెరిచి ఉంచాలని నిర్ణయించారు. స్థానిక భక్తుల దశాబ్దాల కల నెరవేరుతూ ఆలయ ద్వారాలు శాశ్వతంగా తెరుచుకోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అసన్సోల్ నార్త్ నియోజకవర్గం నుంచి గెలిచిన బీజేపీ నేత కృష్ణేందు ముఖర్జీ, తన ప్రచార సమయంలో ఇచ్చిన హామీని వెనువెంటనే నెరవేర్చారు. జిల్లాలోని అన్ని స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడంతో ఈ ఆధ్యాత్మిక మార్పు సాధ్యమైంది. ఎన్నికల ఫలితాల అనంతరం కృష్ణేందు ముఖర్జీ స్వయంగా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ ద్వారాలను భక్తుల కోసం తెరిచారు. గతంలో కేవలం దుర్గా పూజ, లక్ష్మీ పూజలకే పరిమితమైన ఆలయ దర్శనం, ఇప్పుడు నిత్యం అందుబాటులో రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.